టీ20 ప్రపంచకప్ ముంగిట టీమిండియాలో కీలక మార్పు చోటుచేసుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో గాయపడిన యువ ఆల్రౌండర్ హర్షిత్ రాణా స్థానంలో హైదరాబాద్ స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. హర్షిత్ మోకాలి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో, బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. హర్షిత్ లోయర్ ఆర్డర్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడగల సమర్థుడైనప్పటికీ, సిరాజ్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ రాక జట్టు బౌలింగ్ విభాగానికి మరింత బలాన్ని చేకూర్చనుంది. మరోవైపు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం అతను రిహాబ్లో ఉన్నాడని, అతని కోలుకునే తీరును బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది. అందుకే సుందర్కు ప్రత్యామ్నాయాన్ని బోర్డు ఇంకా ప్రకటించలేదు. సిరాజ్ చేరికతో బుమ్రా, అర్షదీప్లతో కూడిన భారత పేస్ త్రయం ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు సిద్ధమైంది. సిరాజ్ చివరిసారిగా 2024 జూలైలో శ్రీలంకపై తన చివరి టీ20 ఆడాడు. ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా అమెరికాతో జరిగే తొలి మ్యాచ్తో భారత్ తన ప్రపంచకప్ వేటను ప్రారంభిస్తోంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరులో సిరాజ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ప్రతిభావంతులు ఉన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమిండియా ఈసారి కూడా కప్పు కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.