Current Date: 22 Jun, 2026

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కి కోహ్లీ ఎంపిక.. కానీ ఒక కండీషన్!

ఐపీఎల్‌లో తొడ కండరాల గాయం కారణంగా అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే, జులై 14, 16, 19 తేదీల్లో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో అతడు బరిలోకి దిగాలంటే ముందుగా తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. కోహ్లి తిరిగి జట్టులోకి రావడంతో అఫ్గాన్‌ సిరీస్‌లో ఆడిన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ కోసం భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్ అక్షర్‌ పటేల్‌ జట్టులోకి పునరాగమనం చేశారు. వీరి రాకతో, అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేసిన యువ బౌలర్లు ప్రిన్స్‌ యాదవ్, హర్ష్‌ దూబెలను సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. మరోవైపు, ఈ నెల 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులోనూ ఒక మార్పు చోటుచేసుకుంది. ఐపీఎల్‌లో పాదం గాయానికి గురైన స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఇంకా పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. అయితే వరుణ్‌ స్థానంలో సెలక్టర్లు వేరే ఎవరినీ ఎంపిక చేయలేదు. ఈ ఐర్లాండ్‌ సిరీస్‌ ముగిసిన తర్వాత, జులై 1 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌, ఆ తర్వాత వన్డే సిరీస్ జరగనున్నాయి.