షికాగో నుంచి ఈ నెల 6న ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంపది గంటల ప్రయాణం అనంతరం తిరిగి వెళ్లిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై విమానయాన సంస్థ విచారణ జరిపి స్పష్టతనిచ్చింది. ఢిల్లీకి బయలుదేరిన ఏఐ 126 ఎయిరిండియా విమానంలోని టాయిలెట్లలో సమస్య తలెత్తిందని, మొత్తం 12 టాయిలెట్లు ఉండగా, అందులో ఎనిమిది పని చేయడం లేదని సిబ్బంది గుర్తించారని సంస్థ పేర్కొంది. టాయిలెట్ పైపుల్లో పాలిథిన్ బ్యాగులు, దుస్తులు ఇరుక్కుపోవడం వల్ల అవి పనిచేయలేదని తెలిపింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ సమయంలో విమానం అట్లాంటిక్ మీదుగా ప్రయాణిస్తుండగా, ఐరోపాలోని నగరాల్లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా, రాత్రి సమయం కావడంతో అక్కడి విమానాశ్రయాల్లో ల్యాండింగ్పై ఆంక్షలు ఉండటంతో తిరిగి షికాగోకు మళ్లించాల్సి వచ్చిందని విమానయాన సంస్థ వెల్లడించింది.