ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీకి కేటాయించిన స్థలంలోనే క్రికెట్ స్టేడియం కూడా ఉండాలన్న సీఎం చంద్రబాబు సూచనల మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. 1.25 లక్షల సీటింగ్ సామర్థ్యంతో స్టేడియం నిర్మించనున్నట్టు వివరించారు. భారీ స్టేడియం నిర్మిస్తుండటంతో దాని పక్కన ప్రజా రవాణా వ్యవస్థ కూడా అందుబాటులో ఉండాలన్న ఏసీఏ విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఐసీసీ చైర్మన్ జైషా కూడా అనుమతినిచ్చినట్టు పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు ఏసీఏ తరపున ఢిల్లీ కేపిటల్స్ను అడిగితే విశాఖలో స్టేడియం బాగాలేదని తిరస్కరించారని, దీంతో మంత్రి లోకేశ్ జోక్యం చేసుకుని స్టేడియాన్ని బాగు చేస్తే రెండు మ్యాచ్లు ఇస్తామని చెప్పారని శివనాథ్ గుర్తు చేశారు. అతి తక్కువ వ్యవధిలోనే స్టేడియంను అద్భుతంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు.
Share