ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ల దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో గగనతలాన్ని మూసివేయడంతో, ఆమె శనివారం నుంచి దుబాయ్లోనే చిక్కుకుపోయారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి ఆమె సమయానికి చేరుకోలేకపోతే తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ప్రయాణ ఆటంకాల దృష్ట్యా క్రీడాకారులు ఆలస్యంగా వస్తే షెడ్యూల్లో మార్పులు చేసేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య యోచిస్తోంది. సింధు రాకపై సందిగ్ధత ఉన్న నేపథ్యంలో, భారత్ తన ఆశలన్నీ లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీపైనే పెట్టుకుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ నంబర్ వన్ షై యుకితో లక్ష్యసేన్ తలపడనుండగా, పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జంట మలేసియా జోడీతో తమ పోరాటాన్ని ప్రారంభించనుంది. అలాగే మహిళల సింగిల్స్లో మాళవిక బాన్సోద్, ఉన్నతి హుడా.. డబుల్స్లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జంట తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ చారిత్రాత్మక టోర్నీలో భారత్ తరఫున ఇప్పటివరకు ప్రకాశ్ పదుకొణె (1980), పుల్లెల గోపీచంద్ (2001) మాత్రమే టైటిళ్లు సాధించారు. 2015లో సైనా నెహ్వాల్, 2022లో లక్ష్యసేన్ రన్నరప్గా నిలిచి తృటిలో టైటిల్ చేజార్చుకున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత క్రీడాకారులు ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.