టీ20 ప్రపంచకప్ 2026లో వరుస డకౌట్లతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సమయంలో టీమ్ మేనేజ్మెంట్ తనను ఎలా ఆదుకుందో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పంచుకున్నాడు. అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్పై జరిగిన వరుస మూడు మ్యాచుల్లో తాను సున్నా పరుగులకే అవుట్ అయినప్పుడు తీవ్ర నిరాశకు లోనయ్యానని, ఆ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాడు హార్దిక్ పాండ్య అండగా నిలిచారని తెలిపాడు. విమర్శల ప్రభావం తనపై పడకుండా ఉండేందుకు, వారు తన ఫోన్ను తీసుకుని సోషల్ మీడియా యాప్లను వెంటనే డిలీట్ చేయించారని అభిషేక్ వివరించాడు. డకౌట్ల తర్వాత ఆందోళనలో ఉన్న తనకు గంభీర్ సర్, సూర్య, హార్దిక్ ధైర్యం చెప్పడమే కాకుండా, బయట ప్రపంచం ఏమనుకుంటుందో అన్నది ముఖ్యం కాదని, డ్రెస్సింగ్ రూమ్లోని 30 మందికి నీపై ఉన్న నమ్మకమే ముఖ్యమని హితబోధ చేశారని తెలిపాడు. కోచ్ గంభీర్ తనను ‘అవుట్ ఆఫ్ ఫామ్’ కాదు ‘అవుట్ ఆఫ్ రన్స్’ అని ప్రోత్సహించడం తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఈ యువ బ్యాటర్ గుర్తు చేసుకున్నాడు. టీమ్ మేనేజ్మెంట్ చూపిన ఈ నమ్మకాన్ని అభిషేక్ శర్మ నిలబెట్టుకున్నాడు. సూపర్-8 దశలో జింబాబ్వేపై 55 పరుగులతో పుంజుకున్న అతను, కీలకమైన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై చెలరేగి ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు సాధించి, ఈ టోర్నీలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేశాడు.
Share