Current Date: 22 Jun, 2026

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడకు పోలీస్ నోటీసులు.. ఏం తప్పు చేశాడంటే?

వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు హిరమండలం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు తమ ఎదుట స్వయంగా హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో నమోదైన ఒక కేసు విచారణ నిమిత్తం పోలీసులు ఈ నోటీసులు అందజేశారు. గత 2025 మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పిన్నింటి చిన్నారావు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అప్పట్లోనే కొత్తూరు సీఐ సీహెచ్‌ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగానే ప్రస్తుత హిరమండలం పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలంటూ దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు ఆదేశించారు.