Current Date: 13 Mar, 2025

ఆస్ట్రేలియా గడ్డపై మళ్లీ భారత్ పరువు నిలిపిన వైజాగ్ కుర్రాడు

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌, ఆంధ్రా కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్నాడు. నితీశ్‌ ఆడింది రెండు టెస్ట్‌ మ్యాచ్‌లే అయినా టీమిండియా పాలిట ఆపద్భాంధవుడిలా మారాడు. అడిలైడ్‌ వేదికగా జరుగతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. స్పెషలిస్ట్‌ బ్యాటర్లంతా విఫలమైన వేల నితీశ్‌ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఆసీస్‌ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక స్కోర్‌. స్టార్క్‌, బోలాండ్‌ బౌలింగ్‌లో నితీశ్‌ కొట్టిన సిక్సర్లు మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి. తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్‌ పుణ్యమా అని భారత్‌ 150 పరుగుల మార్కు దాటింది. రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు విఫలమైన పిచ్‌పై నితీశ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి ఔరా అనిపించాడు.

Share