Current Date: 05 Oct, 2024

రాజశ్యామల కరుణిస్తే "రాజైపోతారా!!??యాగం చేసేస్తే రాజయోగం సిద్ధిస్తుందా?

రాజ్య శ్యామలా" అంటూ ఆ దేవి అంశ  మాతంగిని పఠిస్తూ , ఏభైమంది రిత్వికులతో యజ్ణయాగాలు ఘనంగా చేసేస్తే  ఆ దేవి కరుణించి "రాజ్యాధికారాన్ని" ప్రసాదించేస్తుందా? సీ ఎం కానీ పీఎం కానీ అయిపోవడం ఇంత సులభమా? జనామోదం లేకుండా జగజ్జననీ ఆశీస్సులతో జననేత కాగలమా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే ఉన్న అధికార పీఠాన్ని నిలబెట్టుకోవడానికి జగన్ , కోల్పోయిన అధికార వైభవాన్ని తిరిగి పొందడానికి చంద్రబాబు ఇద్దరూ "రాజ శ్యామల" యాగాలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మరి మాతంగి దేవి ఎవరిని కరుణించి పదవీపగ్గాలు అందజేస్తుంది. ఇరవై రోజుల్లో అమ్మవారి దయ ఎవరికుందో తెలిసిపోతుంది. అసలేమిటీ రాజశ్యామలాయాగం అంటే..,మన దేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలైన యాగాలు జరిగాయి. యజ్ఞం లేదా యాగం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే. వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞం అనేది అగ్నిహోత్రం ద్వారా వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో వేసినవి దేవతలందరికి చేరుతాయని విశ్వాసం. దేవతలు సంతృప్తి చెందితే యాగం చేసిన వారి కోరికలు నెరవేరతాయని అంటారు . యుద్ధాల్లో విజయం సిద్ధిస్తుందని చెబుతారు. పురాణాల్లో చేసిన రాజసూయ యాగం, ఇటీవ‌ల కాలంలో రాజకీయ నాయకులు నిర్వహిస్తున్న‌ రాజ శ్యామల యాగం రెండూ ఒకటేనా…