సచిన్ టెండూల్కర్కు సంబంధించి రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఒక వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయంపై దిగ్గజ అంపైర్ స్టీవ్ బక్నర్ ఎట్టకేలకు స్పందించారు. 2003లో బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్లో ఆసీస్ బౌలర్ జేసన్ గిలెస్పీ వేసిన బంతి సచిన్ ప్యాడ్లకు చాలా ఎత్తులో తగిలింది. బంతి స్పష్టంగా స్టంప్స్ పైనుంచి వెళ్తున్నట్లు రీప్లేలో కనిపిస్తున్నప్పటికీ, బక్నర్ దానిని ఎల్బీడబ్ల్యూగా ప్రకటించి సచిన్ను అవుట్ ఇచ్చారు. సుమారు 20 ఏళ్ల తర్వాత ఆనాటి తన నిర్ణయం తప్పేనని 79 ఏళ్ల బక్నర్ బహిరంగంగా అంగీకరించారు. "సచిన్ను ఆ విధంగా అవుట్ ఇవ్వడం పొరపాటే, ఆ నిర్ణయం గురించి ప్రజలు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు" అని ఆయన పేర్కొన్నారు. మనిషి జీవితంలో తప్పులు సహజమని, తన పొరపాటును తాను ఒప్పుకుంటున్నానని, జీవితం ముందుకు సాగిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. వెస్టిండీస్కు చెందిన స్టీవ్ బక్నర్ క్రికెట్ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడైన అంపైర్లలో ఒకరు. ఆయన 1989 నుండి 2009 వరకు సుమారు 128 టెస్టు మ్యాచ్లకు బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా, 1992 నుండి 2007 వరకు వరుసగా ఐదు వన్డే ప్రపంచకప్ ఫైనల్స్లో అంపైర్గా వ్యవహరించి రికార్డు సృష్టించారు.