Current Date: 06 Jul, 2024

రచ్చకెక్కిన అయ్యన్న /జమీల్ కుటుంబ కలహాలు

మాజీ మంత్రి చింతకాయల  అయ్యన్నపాత్రుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సన్యాసి పాత్రుడు కుటుంబాల మధ్య ఉన్న కలహాలు మరోసారి రచ్చకెక్కాయి. వీరి ఇంటి ఇలవేల్పుగా కొలిచే మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర నేపథ్యంలో మరోసారి పరస్పరం ఆరోపణలకు, దూషణలకు దిగారు. ఈనెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నర్సీపట్నంలో  అంగరంగ వైభవంగా మరిడిమహాలక్ష్మి జాతర మహోత్సవాలు నిర్వహించనున్నారు. 23 వ తేదీన పండగ జరుపుతున్నారు. మరిడి మహాలక్ష్మి అమ్మవారిని తమ ఇంటి ఎల్లవేళలా అయ్యన్నపాత్రుమికులు కొలుస్తారు. రెండేళ్లకోసారి జరిగే ఈ పండుగను  వారి ఆధ్వర్యంలోనే ఇప్పటివరకు  నిర్వహిస్తూ వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ,ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేశారు. మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆభరణాలను సోదరుడు జమీల్ తన ఇంట్లో ఉంచుకున్నారని, అమ్మవారికి అలంకరించడం లేదని ఈ ఏడాది జరిగే అమ్మవారి జాతరలో ఆభరణాలు తీసుకురాకపోతే, పోలీస్ కేసు పెడతానని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. ఉగాది రోజున అయ్యన్నపాత్రు ఇంటి వద్ద జరిగిన ఉగాది పంచాంగ శ్రవణం అనంతరం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ  మహాలక్ష్మి అమ్మవారి జాతర జరిపి తీరుతామని, ఎలాంటి ఆదాయం లేకపోయినా, ఎమ్మెల్యే గణేష్ రాజకీయ కక్షతో ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేశారని ఆరోపించారు. అయితే అమ్మవారికి అలంకరించే ఆభరణాలు సన్యాసి పాత్రుడు తన ఇంట్లో ఉంచుకున్నారని, ఆభరణాలు అమ్మవారికి అలంకరించడానికి తీసుకురావడం లేదని, ఆభరణాలు ఇవ్వకపోతే పోలీసు కేసు పెడతానని అయ్యన్నపాత్రుడు అన్నారు.  

దీనికి ప్రతిగా బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు సోదరుడు నర్సీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ సన్యాసి పాత్రుడు (జమీల్) మాట్లాడుతూ అమ్మవారి పేరుతో వసూలు చేసిన ఆరు లక్షల రూపాయల బ్యాంకు లో డిపాజిట్  చేశామన్నారు. తర్వాత ఆ డబ్బును డ్రా చేసి అయ్యన్నపాత్రుడు ఏం చేశారో తెలియదన్నారు., దీనికి సంబంధించి  తాను కూడా పోలీస్ కేసు పెడతానని హెచ్చరించారు. మరిడి మహాలక్ష్మి అమ్మవారి బంగారం, వెండి ఆభరణాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు.ఆభరణాలను దేవాదాయ శాఖకు పెద్దల సమక్షంలో అప్పగించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అయ్యన్నపాత్రుడు కుటుంబానికి మాత్రం ఆభరణాలు  ఇవ్వనని అన్నారు. అమ్మవారి పండగ ప్రజల సహకారంతో చేసామని, మన సొంత డబ్బులతో  చేయలేదని, తాము కూడా డబ్బులు వేసుకొని, ప్రజలు ఇచ్చిన డబ్బులు కలిపి పండగ చేసేవాళ్ళమని గుర్తు చేసారు. పగలంతా చందాలు వసూలు చేసి, రాత్రి జాగారం చేస్తూ, మడి మహాలక్ష్మి అమ్మవారి జాతరను నేనే నిర్వహించే వాడినని జమీల్ చెప్పారు. మొత్తం మీద ఇంటి ఇలవేల్పు మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర నేపథ్యంలో,రెండు కుటుంబాల మధ్య ఉన్న కలహాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇద్దరు సోదరులలో  ఒకరైన అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నర్సీపట్నం అసెంబ్లీకి పదో సారి పోటీ చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చింతకాయల సన్యాసి పాత్రుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ విజయానికి కృషి చేస్తున్నారు.