Current Date: 07 Oct, 2024

కబ్జాకాండతో విశాఖను చిగురుటాకులా వణికించారు

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చేసిన ట్విట్టర్‌ కామెంట్స్‌కు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కౌంటర్‌ ఇచ్చారు. కబ్జా కాండతో విశాఖను చిగురుటాకులా వణికించిన చరిత్ర మీదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా ఇంకా మీకు సిగ్గు రాలేదని విమర్శించారు. మేము అధికారం చేపట్టి 35 రోజులే అయ్యిందని.. కానీ ఎర్ర మట్టి దిబ్బల్లో 6 నెలల నుంచి పనులు జరుగుతున్నాయన్నారు. ఎర్రమట్టి దిబ్బల దగ్గర జరుగుతున్న తవ్వకాలు ఎప్పటి నుంచి చేస్తున్నారో భీమిలి కో ఆపరేటివ్‌ ఎయిడెడ్‌ సొసైటి కార్యదర్శి సూరిబాబు మాటల్లోనే విని సిగ్గుపడండని గంటా విమర్శించారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీ నేతలు చెప్పేవన్నీ అసత్యాలేనని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నామని గంటా తెలిపారు. నిజాల నిగ్గు తేల్చడానికి విచారణ కమిటీ నియమించామని, కానీ మీరేం చేశారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ మొద్దు నిద్ర నటించారని మండిపడ్డారు. పనులు ఆపిన తమపై బురద జల్లడం వైసీపీ నేతల కుసంస్కారానికి నిదర్శనమని గంటా శ్రీనివాసరావు గుడివాడ అమర్‌నాథ్‌ను విమర్శించారు. అధికారం అండతో భూకబ్జా కాండకు తెర తీసి ప్రశాంతమైన విశాఖను చిగురుటాకులా వణికించిన చరిత్ర మీదని ఏకి పారేశారు.

Share