Current Date: 06 Jul, 2024

రైల్లో ప్రయాణిస్తుంటే.. ఇలాంటి వారితో జాగ్రత్త!

కంచే చేను మేసింది అన్నట్టుగా మారిపోయింది ప్రస్తుత కాలం. బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. రక్షణగా ఉండాల్సిన వ్యక్తులు.. రాక్షసుల్లా మారుతున్నారు. సమాజంలో ఎలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యాతయుతమైన హోంగార్డే.. తన బాధ్యతను విస్మరించి పాడుపనికి తెగబడ్డాడు.ఒంటిపై యూనిఫామ్‌ ఉందని కూడా మర్చిపోయి నిద్రిస్తున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించి.. ఆ డ్రె‌స్సుకున్న గౌరవాన్ని తగ్గించాడు. ఈ ఘటన.. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌లో జరిగింది. ఓ కుటుంబం తిరుపతి నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌‌కు వస్తోంది. ఈ క్రమంలో హోంగార్డు ప్రతాప్‌.. ఎస్‌-3 కోచ్‌లో నిద్రిస్తున్న యువతి వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్టు.. బాధితురాలి తండ్రి రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు.రైలు కాచిగూడ చేరుకున్న వెంటనే.. పోలీసులు హోంగార్డును అరెస్టు చేశారు. కోడూరు పీఎస్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ప్రతాప్‌ యూనిఫామ్‌లో ఉండి.. టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. నిందితుడి స్వస్థలం కడప జిల్లా రైల్వే కోడూరు అని పోలీసులు తెలిపారు.