భారత యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ ఏడాది మార్చి నెలలో పృథ్వీ షాకు ఆకృతి అగర్వాల్తో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరి పెళ్లి గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఆకృతి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన కొన్ని పోస్ట్లు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. ఆకృతి తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "నేను జీవితంలో చాలాసార్లు మోసపోయాను. కానీ ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. అతడితో కలిసి నా జీవితంలో ముందుకెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నాక.. ఇప్పుడు జరుగుతున్న ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను" అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా, "అతడి గురించి సామాజిక మాధ్యమాల్లో చూసిందంతా నిజమే. వస్తున్న వదంతులన్నీ కూడా వాస్తవమే" అని మరో పోస్ట్లో పేర్కొనడం పెద్ద సంచలనంగా మారింది. ఆకృతి పెట్టిన ఈ పోస్ట్లు పృథ్వీ షాను ఉద్దేశించినవేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే, ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పృథ్వీ షాను అన్ఫాలో చేయలేదు. గతంలో కూడా పృథ్వీ షా ఒక రెస్టారెంట్, రోడ్డుపై గొడవలు పడి వివాదంలో చిక్కుకున్నారు. అంతేకాకుండా టీమ్ మేనేజ్మెంట్ కూడా అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని.. జట్టు నుంచి బయటికి పంపించేసింది.