ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' చిత్రం థియేటర్ల నుంచి ఓటీటీ వరకు విమర్శల పరంపరను ఎదుర్కొంటోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా, తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ ఉన్నప్పటికీ, బలహీనమైన కథనం కారణంగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిరస్కరించారు. అయితే, ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ సినిమాపై ట్రోలింగ్ మరింత ముదిరింది. ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ పాత్రకు చాలా చోట్ల డూప్ను వాడటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం హీరోకే కాకుండా, హీరోయిన్ మాళవిక మోహనన్కు కూడా డూప్ను ఉపయోగించినట్లు తాజాగా బయటపడటంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్లతో పోలిస్తే మాళవికకు కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కినప్పటికీ, ఆమె ఫైట్ సీన్లలో డూప్ను వాడటం గమనార్హం. చిత్రంలో విలన్ గ్యాంగ్లో నటించిన రోన్సన్ విన్సెంట్ అనే నటుడు, సెట్స్ లో హీరోయిన్ డూప్తో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో "సినిమా మొత్తం డూప్లతోనే తీశారా?" అంటూ నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. సాధారణంగా పెద్ద సినిమాల్లో రిస్క్తో కూడిన యాక్షన్ సీన్ల కోసం డూప్లను వాడటం సహజమే అయినా, వాటిని అత్యంత రహస్యంగా ఉంచుతారు. కానీ 'రాజాసాబ్' విషయంలో మేకర్స్ ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం. సినిమా విడుదలకు ముందే దర్శకుడు మారుతి, ప్రభాస్కు డూప్ను వాడినట్లు బహిరంగంగానే అంగీకరించగా, ఇప్పుడు హీరోయిన్ డూప్ ఫోటోలు కూడా బయటకు రావడంతో చిత్ర బృందం తీవ్రంగా ట్రోలింగ్కు గురవుతోంది.
Share