Current Date: 06 Jul, 2024

హెలికాప్టర్‌లో తూలి పడిన మమతా బెనర్జీ . స్వల్ప గాయాలకు గురైన దీదీ

కోల్‌కతా, న్యూస్‌లీడర్‌, ఏప్రిల్‌ 27 : పశ్చిమ బెంగాల్‌  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  మరోసారి గాయపడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కిన ఆమె అదుపుతప్పి తూలి కింద పడిపోయారు. శనివారం మధ్యాహ్నం పశ్చిమ బర్ధమాన్‌ జిల్లాలోని దుర్గాపుర్‌ నుంచి దీదీ అసన్‌సోల్‌ వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కారు. లోపలికి వెళ్లి సీట్లో కూర్చునే సమయంలో ఆమె బ్యాలెన్స్‌ కోల్పోయి కిందపడిపోయారు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే సాయం చేశారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయమైందని, అయినప్పటికీ సీఎం తన ప్రయాణాన్ని కొనసాగించారని అధికారులు వెల్లడిరచారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. అసన్‌సోల్‌ స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి అలనాటి నటుడు, ఎంపీ శతృఘ్నసిన్హా పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మమతా బెనర్జీ శనివారం ప్రచారం నిర్వహించారు.
కాగా.. దీదీ గత నెల తన ఇంట్లోనే జారిపడటంతో నుదుటిపై తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. మమత నుదుటి నుంచి రక్తం కారుతున్న ఫొటోను పార్టీ విడుదల చేసింది. ఆ తర్వాత తలకు కట్టుతోనే ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక, 2023 జూన్‌లోనూ ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో అత్యవసరంగా హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేయగా.. అందులో నుంచి కిందకు దిగుతూ మమతా బెనర్జీ గాయపడ్డారు. ఆమె మోకాలు, తుంటి లిగ్‌మెంట్లకు గాయాలయ్యాయి.