Current Date: 05 Oct, 2024

అధైర్యపడకుండా అడుగులేయండి

కాళ్లు చేతులు కోల్పోయామని దివ్యాంగుల అధైర్య పడవద్దని, ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలని విజయనగరం జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ సెక్రటరీ కె. విజయకళ్యాణి సూచించారు. మంగళపాలెంలోని శ్రీ గురుదేవచారిటబుల్ ట్రస్ట్, విర్కో ఫౌండేషన్ వారి సహకారంతో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.మారుమూల చిన్న గ్రామంలో 24 ఏళ్ల పాటూ దివ్యాంగులకు ఎన్నో రకాలుగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ట్రస్ట్ చైర్మన్ జగదీశ్ ధన్యుడని అభినందించారు. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్స్, ఇతరత్రా న్యాయపరమైన సేవల్లో ఇబ్బందులు కలిగితే జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీకి ధరకాస్తు చేసుకోవచ్చునని, తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేస్తామని అవగాహన కల్పించారు. ముందుగా ట్రస్ట్ ప్రాంగాణంలోని అవయవ తయారీ కేంద్రం, గురుదేవ హాస్పటల్స్ ను ఆమె సందర్శించారు. విర్కో ఫౌండేషన్ వారి ఆర్థిక సాయంతో సుమారు 175మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ ఉపకారణాలు, ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, బ్లైండ్ స్టిక్స్, చెవిటి మిషన్లు అందజేశారు. అంధులకు పింఛన్లు, వృద్ధులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విర్కో ఫౌండేషన్ జి.ఎం టి.ప్రవీణ, ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీశ్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ ఫణీంద్ర, ట్రస్ట్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Share