Current Date: 30 Sep, 2024

ఐపీఎల్ జట్టులోకి మళ్లీ రాహుల్ ద్రవిడ్ రీఎంట్రీ

టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ను నియమించబోతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఆరంభ సీజన్ అయిన 2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలిచింది. అప్పటి నుంచి మళ్లీ టైటిల్ సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ భావిస్తోంది.రాజస్థాన్ రాయల్స్ తరఫున గతంలోనూ ద్రవిడ్ ఆడాడు. 2012, 2013 సీజన్లలో ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలోనే రాజస్థాన్ రాయల్స్ 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినా  రాయల్స్‌తోనే ద్రవిడ్ కలిసి పని చేశాడు. 2014, 2015లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ డైరెక్టర్‌గా సేవలందించాడు.భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఎంపికైన తర్వాత ఐపీఎల్‌కి దూరంగా ద్రవిడ్ ఉండిపోయాడు. ఆ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికై ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ 2024ను భారత్‌ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. దాంతో మళ్లీ అతనికి రాజస్థాన్ రాయల్స్ నుంచి పిలుపు వచ్చింది.

Share