Current Date: 05 Oct, 2024

వేణు స్వామి జాతకం రేపు తెలిసి పోతుందట

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కూడా మిశ్రమంగా ఉండటంతో టెన్షన్ పెరుగుతోంది. ఈ క్రమంలో తరచూ వార్తల్లో ఉండే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరేం చెప్పినా తాను చెప్పిందే జరుగుతుందంటున్నారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అధికార పార్టీ ఓ వైపు, తెలుగుదేశం-జనసేన-బీజేపీ మరోవైపు కూటమిగా ఎన్నికల్ని ఎదుర్కొన్నాయి. అధికార పార్టీని గద్దె దించేందుకు కూటమి పార్టీలు అన్ని యత్నాలు చేశాయి. అటు పోలింగ్ కూడా భారీగా నమోదైంది. జూన్ 1 సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం అందరి టెన్షన్ మరింతగా పెంచాయి. కొన్ని సంస్థలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందంటుంటే మరికొన్ని సంస్థలు కూటమిదే అధికారం అంటున్నాయి. ఈ నేపధ్యంలో సంచలన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉంటున్న ఆధునిక జ్యోతిష్యుడు వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరేమి చెప్పినా తాను చెప్పిందే జరుగుతుందని రిపీట్ చేశారు. రోజుకో మాట మాట్లాడేందుకు తానేమీ రాజకీయ నాయకుడిని కాదని, జ్యోతిష్యుడినని ఒకే మాటపై నిలబడతానని చెప్పుకొచ్చారు. గతంలో చాలా సందర్భాల్లో చెప్పిందే జరుగుతుందన్నారు. ఏ ఎగ్జిట్ పోల్ ఏం చెప్పినా ఏపీలో ఈసారి అధికారంలో వచ్చేది మరోసారి జగనే అని వేణు స్వామి స్పష్టం చేశారు. జాతకం ప్రకారం వైఎస్ జగన్‌ది ఆరుద్ర నక్షత్రమని 2023 నుంచి అష్టమ శని ప్రారంభమై మరో రెండేళ్లుంటుందన్నారు. ప్రస్తుతం ఈ అష్టమ శని మంచి స్థితిలో ఉన్నందున మరోసారి ముఖ్యమంత్రి యోగం వైఎస్ జగన్‌కు కచ్చితంగా ఉందన్నారు. ఇప్పుడే కాదు 2029 ఎన్నికల్లో సైతం జగనే ముఖ్యమంత్రి అని మరోసారి జోస్యం చెప్పారు.ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 టైటిల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచి తీరుతుందని బల్లగుద్ది చెప్పిన జోస్యంలానే ఇది కూడా ఉంటుందా అని ట్రోలింగ్ ప్రారంభించేశారు కొందరు.