Current Date: 11 Oct, 2024

మళ్లీ చిక్కుల్లో దువ్వాడ తిరుమలలో దివ్వెల మాధురిపై కేసు నమోదు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు నమోదైంది. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమెపై తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 7న మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌ తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండపై మాధురి ఫొటోషూట్, రీల్స్ చేశారు. అయితే, ఆ రీల్స్ ఇప్పుడు దివ్వెల మాధురిని చిక్కుల్లోకి నెట్టింది. ఆలయం ఎదుట ఆమె రీల్స్‌ చేయడంపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. ఇది టీటీడీ నిబంధనలు, ఆలయ సంస్కృతిని ఉల్లంఘించడమేనని పలువురు భక్తులు, టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయం వద్ద ఫొటో షూట్ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకుంటూ సహజీవనం చేస్తున్నామని ఆమె వెల్లడించారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం వ్యవహారం గత రెండు నెలలుగా ఏపీ వ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Share