Current Date: 04 Jul, 2024

Pushpa producer in entanglements.. exposed in phone tapping investigation

పుష్ప మూవీ ప్రొడ్యూసర్ నవీన్ చిక్కుల్లో పడ్డారు. వ్యాపారిని కిడ్నాప్‌ చేసి నిర్బంధించి కంపెనీ షేర్లను బదిలీ చేయించుకున్న కేసులో మైత్రీ మూవీస్‌ అధినేత నవీన్‌ ఎర్నేనితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.


జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి చెన్నుపాటి వేణుమాదవ్‌ క్రియా హెల్త్‌ కేర్‌ను నెలకొల్పారు. అది వృద్ధిలోకి వస్తున్న క్రమంలో టేకోవర్‌ చేసేందుకు సంస్థ డైరెక్టర్లు మరికొంతమంది పథకం వేశారు. ఇందుకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సాయం తీసుకున్నారు. ఆ విభాగం పోలీసులు 2018లో వేణుమాధవ్‌ను కిడ్నాప్‌ చేసి రూ.40 కోట్ల విలువ చేసే షేర్లను అక్రమంగా బదలాయించారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీసీగా పనిచేసిన రాధాకిషన్‌రావు అరెస్టుతో వేణుమాదవ్‌ నాలుగు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు.

ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. రాధాకిషన్‌రావు, అప్పటి టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు, ఎస్‌ఐ మల్లికార్జున్‌, గోల్డ్‌ఫిష్‌ సీఈవో చంద్రశేఖర్‌, క్రియా హెల్త్‌ కేర్‌ డైరెక్టర్లు గోపాల్‌, రాజ్‌, నవీన్‌, రవి, బాలాజీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నవీన్‌ ఎర్నేనితో పాటు మరికొందరి పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు