Current Date: 05 Oct, 2024

ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుపై హర్షం

ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాకంటక ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడం హర్షనీయమని బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మి, సీనియర్ న్యాయవాది పైడి వరహా నరసింహులు అన్నారు. సోమవారం స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద భూయాజమాన్య హక్కుచట్టం రద్దు నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తూ కేకు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన వైసీపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ న్యాయవాద సంఘాలు, రైతులు పోరాటం చేసినా గత ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఈ చట్టంతో అభద్రతాభావం నెలకొనడం, ఇంతలో ఎన్నికలు రావడంతో వారంతా ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పారన్నారు. ఇదే సమయంలో ఈ చట్టం రద్దుకు హామీనిచ్చి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంపై కూటమి ప్రభుత్వానికి న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. 

Share