Current Date: 06 Oct, 2024

కర్నూలులో రైతుకి దొరికిన వజ్రం.. ధర తెలిస్తే షాక్!

కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా పొలాల్లో వజ్రాల కోసం గాలింపు కొనుసాగుతోంది. కొంత మందికి వజ్రాల రూపంలో అదృష్టం వరిస్తోంది. కొంతమంది రైతులు, కూలీలకు వజ్రాలు దొరికాయి. తాజాగా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన రైతుకు విలువైన వజ్రం దొరికింది.

పొలంలో పనులు చేస్తుండగా ఆయనకు వజ్రం కనిపించింది.. ఆ వజ్రాన్ని స్థానిక వజ్రాల వ్యాపారి రూ.4 లక్షల డబ్బులు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు జనాలు వజ్రాల కోసం వెతుకుతున్నారు. తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, చెన్నంపల్లితో పాటుగా పలు గ్రామాల్లో ఇప్పటికే వజ్రాలు దొరుకుతున్నాయి. ఈ విషయం తెలియడంతో పక్క జిల్లాలు, రాష్ట్రాల నుంచి జనాలు వజ్రాల కోసం వస్తున్నారు. కర్నూలు జిల్లా మాత్రమే కాదు అనంత‌పురం జిల్లా వ‌జ్రక‌రూరులో వ‌జ్రాల కోసం వేట నడుస్తోంది.

స్థానిక వ్యాపారులందరూ సిండికేట్‌గా మారి వజ్రాలు దొరికిన వ్యక్తుల నుంచి తక్కువ ధరకే దక్కించుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ తతంగమంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.