Current Date: 04 Jul, 2024

‘ఆర్‌ఎంఎస్‌’కు వెళ్తే అంతే!

అత్యంత వేగంగా పోస్టును అందిస్తామని, కొరియర్లు, పార్శిలు స్వీకరించే ఆర్‌ఎంఎస్‌ చర్యల్లో మాత్రం వెనుకబడుతోంది. విశాఖ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న ఆర్‌ఎంఎస్‌ కార్యాలయంలో సిబ్బంది నత్తనడకన వ్యవహరిస్తుండడంపై వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కార్యాలయానికి సుదూరాల నుంచి జనం వస్తుంటారు. న్యాయవాదుల సహా అనేక మంది ఇక్కడి సేవలు వినియోగించుకుంటారు. ముఖ్యమైన పత్రాలు పంపిస్తే ఇక్కడ ఇచ్చే ఎక్‌నాలెడ్స్‌మెంట్‌ తమకెంతో ముఖ్యంగా అనేక వర్గాలు భావిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఈ సెంటర్‌కు తాకిడి అధికమైంది. మరుచటి రోజు ఆదివారం సెలవు కావడంతో జనం పోటెత్తారు. అయితే ఇంత తెలిసినా ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కాలం చెల్లిన సిస్టమ్స్‌ ఇక్కడ వాడుతుండడంతో ప్రింట్‌ సరిగా రావడం లేదు. అనుభవం లేని సిబ్బంది ఉంటున్నారని, సిబ్బంది లేమి కారణంగా విధుల్లో బాధ్యతా రాహిత్యం కనిపిస్తోందని, కనీసం ఇక్కడి నుంచి ఎసెమ్మెస్‌లు కూడా రావని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. చివరకు కంప్లెయింట్‌ బుక్‌ కూడా లేదనేయడంతో ఆప్‌ సబ్‌ కీ ఆవాజ్‌ సంస్థ సహ కార్యదర్శి భావిశెట్టి కిరణ్‌ కుమార్‌ చొరవతో ఆ పుస్తకాన్ని వెతికి అక్కడ తామెదుర్కొన్న సమస్యల్ని రైల్వే శాఖ సహా టెలీ, కమ్యూనికేషన్‌ కేంద్ర శాఖ దృష్టికి తీసుకు వెళ్లి నివేదించారు.