Current Date: 06 Jul, 2024

ధ్యానంలో ప్రధాని మోడీ

తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానం కొనసాగుతోంది. స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రాక్‌ మెమోరియల్‌లో మోడీ మెడిటేషన్‌ కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ధ్యాన ముద్రలోకి వెళ్లిన ఆయన.. శనివారం మధ్యాహ్నం వరకు అంటే దాదాపు 45 గంటల పాటు ఇక్కడే రేయింబవళ్లు ధ్యానం చేయనున్నారు.  అంతకుముందు తాను పోటీ చేస్తున్న వారణాసి లోక్‌ సభ స్థానంలో ప్రచారం ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులోని కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ ఆయన ముందుగా భగవతీ అమ్మన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ, అరటిపండ్లు సమర్పించారు. ఆలయ పూజారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.ఇక ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కన్యాకుమారిలో అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, 2019 ఎన్నికలు ముగిశాక కేదార్‌నాథ్‌ గుహల్లో ధ్యానం చేసిన ప్రధాని.. ఈసారి తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌ మెమోరియల్‌ను ఎంచుకున్నారు.