ఈ నెల 30వ తేదీన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో అర్చకులు, అధికారులు శుద్ధి కార్యక్రమాలు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి దర్శనాలను నిలిపివేశారు. శుద్ధి కార్యక్రమం ముగిసిన తరువాత ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నేపథ్యంలో వారపు సేవైన అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా రద్దు చేశారు. కాగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఆనందనిలయం మొదలు కొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా సంప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేధ్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
Share