Current Date: 02 Jul, 2024

ఎంవీవీ, జీవీలపై కేసు నమోదు

విశాఖ మాజీ ఎంపీ, స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, ఆడిటర్‌ గన్నమని వేంకటేశ్వరరావు (జీవీ)లపై ఆరిలోవ పోలీసులు ఈ నెల 22న క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. హయగ్రీవ ఫార్మ్స్‌ అండ్‌ డెవలపర్‌ చిలుకూరి జగదీష్‌ (జగదీశ్వరుడు) ఫిర్యాదు మేరకు వీరిద్దరిపైనా కేసు నమోదు చేసి ఐపీసీ 120బీ, 420, 465, 467, 468, 471, 383, 506, రెడ్‌ విత్‌ 34ఐపీసీ సహా 8సెక్షన్లను విధించారు. ఎండాడలో 12.51ఎకరాల్లో సీనియర్‌ సిటిజన్‌ హౌసింగ్‌ పేరిట 2010లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయగ్రీవ సంస్థకు భూములు కేటాయించింది. ఆ ప్రాజెక్టుకు ఆడిటర్‌గా జీవీని నియమించారు. ఇదిలా ఉంటే సదరు ప్రాజెక్టులో డెవలపర్లగా ఎంవీవీ సత్య నారాయణ, గద్దె బ్రహ్మాజీలను జీవీ పరిచయం చేశారు. వీరందరి మధ్య 2020లో ఓ ఒప్పదం కుదిరింది. అయితే చిలుకూరి జగదీశ్‌, అతని భార్య రాధారాణిలను బెదిరించడమే కాకుండా, విలువైన పత్రాల్ని జీవీ, ఎంవీవీ స్వాధీనం చేసుకున్నారని, నకిలీ డాక్యుమెంట్స్‌ సృష్టించి, వాటిపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సేల్‌ డీడ్‌పైనా ఎంవీవీ, జీవీ నకిలీ సంతకాలు చేయించేశారనే ఆరోపణలూ ఉన్నాయి. 

Share