Current Date: 06 Jul, 2024

ఎన్నికల బరిలో యువరాజు.. కానీ ఇల్లు, కారు లేదు!

ఎన్నికల్లో రాజకుటుంబాలకు చెందిన వారసులు బరిలోకి దిగుతున్నారు. మైసూర్ వారసుడు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌ మొదటిసారి బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా అతను సమర్పించిన ఎన్నికల అఫిడ్‌విట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తంగా రూ.4.99 కోట్ల మేర ఆస్తులున్నాయని, కానీ, సొంత ఇల్లు, భూమి, కనీసం కారు కూడా లేదని పేర్కొన్నారు.

ఏప్రిల్‌ 3న యదువీర్‌ నామినేషన్‌ వేయాలని భావించినా... సోమవారం మంచిరోజు కావడంతో నామినేషన్‌ వేసినట్లు తెలిపారు. తన తల్లి ప్రమోద దేవీ వడియార్‌, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీవత్సతో కలిసి మైసూరులోని ఎన్నికల అధికారికి రెండు సెట్లు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. మరో సెట్‌ను ఏప్రిల్‌ 3న దాఖలు చేయనున్నారు.

మైసూరు రాజ్యాన్ని వడియార్‌ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పాలించింది. యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌ 2016లో దుంగార్‌పుర్‌ యువరాణి త్రిషికను వివాహమాడారు. రెండు దశాబ్దాల తర్వాత వడియార్‌ వారసుడు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు.