Current Date: 04 Jul, 2024

Dhoni magic again in IPL 2024. Chennai to the top!

ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ మ్యాజిక్ చేశాడు. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా కీపింగ్ చేసిన ధోనీ చేజారిపోతున్నట్లు కనిపించిన మ్యాచ్‌లో చెన్నైని గెలిపించాడు. దాంతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన చెన్నై టీమ్ పాయింట్ల పట్టికలోనూ టాప్‌లోకి దూసుకెళ్లింది.

మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆ టీమ్‌లో శివమ్ దూబె హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ టీమ్ ఫస్ట్‌లో తడబడినా మిడిల్ ఓవర్లలో పుంజుకుంది. విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్ క్రీజులో నిలదొక్కుకుని గుజరాత్ టీమ్‌ని గెలిపించేలా కనిపించారు.

కానీ.. విజయ్ శంకర్ ఇచ్చిన క్యాచ్‌ను 42ఏళ్ల వయసులోనూ ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి పట్టుకున్న ధోనీ మ్యాచ్‌ను చెన్నైవైపు తిప్పాడు. ఆ తర్వాత కూడా వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కి సలహాలు, సూచనలు ఇస్తూ కనిపించాడు. దాంతో మ్యాచ్‌లో 143/8కే పరిమితమవగా.. 63 పరుగుల తేడాతో చెన్నై గెలిచింది.