Current Date: 05 Oct, 2024

ఏపీకి ఇది సరికొత్త ఉషోదయం: మంత్రి నారా లోకేశ్

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ప్రకటించడం పట్ల రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ్టి బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనల పట్ల హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ కేటాయింపులు ఏపీ అభివృద్ధికి, సామాజిక లక్ష్యాలను అందుకోవడానికి ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు.  "ఏపీకి ఇది సరికొత్త ఉషోదయం. కేంద్రం మన పోరాటాన్ని గుర్తించి పారిశ్రామికాభివృద్ధి, మౌలికసదుపాయాలు, నీటిపారుదల, మానవ వనరుల అభివృద్ధి వంటి ముఖ్యమైన రంగాలను కవర్ చేసేలా ప్రత్యేకమైన, సంపూర్ణ ప్యాకేజి ప్రకటించడం ఏపీ ప్రజలకు గర్వకారణం. ఈ సందర్భంగా కేంద్రం అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఉదారంగా సాయం ప్రకటించడం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం. నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. మన కలల రాష్ట్రాన్ని నిర్మించుకునే దిశగా ఇది తొలి అడుగు" అని నారా లోకేశ్ తన ట్వీట్ లో వివరించారు.

Share