Current Date: 07 Oct, 2024

బీఆర్‌ఎస్ నుంచి పదో ఎమ్మెల్యే జంప్ నేరుగా కాంగ్రెస్ గూటికి!

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కి వరుస షాక్‌లు తగులుతున్నాయి. గత ఏడాది చివర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగుతూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే 9 మంది అధికారికంగా హస్తం గూటికి చేరుకోగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా అఫీషియల్‌గా చేరిపోయారు.పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారంటూ నిన్నటివరకూ  సోషల్ మీడియాల్లో వార్తలు వైరల్ కాగా వాటికి చెక్ పెడుతూ డైరెక్టుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మహిపాల్ రెడ్డితో పాటు మహిపాల్ రెడ్డితో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కూడా తిరిగి సొంత గూటికీ చేరుకున్నారు.గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంఖ్య పదికి చేరింది. మహిపాల్ రెడ్డి కంటే ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ.. బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేరుకున్నారు. 

Share