Current Date: 07 Oct, 2024

పట్టాలు తప్పిన దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ ముగ్గురి మృతి

చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, 30 మంది వరకు గాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లోని గోండా సమీపంలో మోతీగంజ్-ఝిలాహీ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రైలు పట్టాలు తప్పడానికి ముందు పేలుడు వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఆ వెంటనే రైల్లో చీకటి అలముకుని, గందరగోళం తలెత్తినట్టు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఎంపీ కృతి వర్ధన్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనపై రైల్వే అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ప్రకటించింది.

Share