Current Date: 05 Oct, 2024

పిడుగు పడి మత్స్యకార యువకుడు మృతి ఫిషింగ్ హార్బర్ లో విషాద ఘటన

ఫిషింగ్ హార్బర్ లో పిడుగుపడి మత్స్యకార   యువకుడు దుర్మరణం చెందారు. స్థానిక జాలారిపేటకు చెందిన  తుమ్మి పోలిరాజు  చేపల వేటకు వెళ్లి ఆదివారం తెల్లవారుజామున ఫిషింగ్ హార్బర్ చేరుకున్నారు. ఆ సమయంలో భారీగా ఉరుములు మెరుపులతో  వర్షం కురుస్తుండగా  బోటును నాలుగో నెంబర్ జెట్టికి కడుతుండగా ఒక్కసారిగా పిడుగు  అతనిపై పడింది. దీంతో తీవ్ర విద్యుత్ షాక్  కు గురై అక్కడికక్కడే పోలిరాజు  మృతి చెందారు. అతనితో పాటు చేపల వేటకు వెళ్లి వచ్చిన మత్స్యకారులు తమ కళ్ళముందే  పిడుగుపాటుతో పోలిరాజు   మరణించడంతో  విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని  కన్నీరు మున్నీరుగా విలపించడంతో  ఫిషింగ్ హార్బర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు  అక్కడికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎస్సై పురుషోత్తం నేతృత్వంలో  ఒకటో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.