Current Date: 06 Jul, 2024

ప్రసారాలు ముగిసాయి పంపకాలు కొనసాగుతాయి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ఈరోజు ముగియనుంది. సోమవారం పోలింగ్‌ జరగనుండటంతో 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురించడం, ప్రసారం చేయకూడదు. ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి ప్రచారంతో హోరెత్తించిన రాజకీయ పార్టీల మైకులు సాయంత్రం మూగబోనున్నాయి.

చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం ఉంటుంది. పోలింగ్‌ ముగింపు సమయం ఆధారంగా మద్యం దుకాణాలకు 48 గంటల డ్రై డే ఉంటుంది. నియోజకవర్గం వెలుపల నుంచి ప్రచారం నిమిత్తం తీసుకువచ్చిన, నియోజకవర్గ ఓటర్లు కాని రాజకీయ కార్యకర్తలు/పార్టీ కార్యకర్తలు అంతా ప్రచార సమయం ముగిసిన వెంటనే నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలి. 48 గంటల వ్యవధిలో ఓటర్లు కాని ఇతర వ్యక్తులు స్థానిక లాడ్జిలు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు మొదలైన వాటిలో లేరని అధికారులు నిర్ధారించుకోవాలి.

పోలింగ్‌ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్‌ ఏజెంట్ల నియామక జాబితాను రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. పోలింగ్‌ తేదీ రోజు ప్రిసైడింగ్‌ అధికారికి పోలింగ్‌ ఏజెంట్‌ తమ వివరాలు సమర్పించి విధులకు హాజరు కావచ్చు.