Current Date: 07 Oct, 2024

2026 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు

2026 నాటికి భోగాపురం విమానాశ్రయం తొలిదశను పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఎయిర్‌ పోర్ట్‌ పూర్తయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. దీనిని పూర్తి చేయించే బాధ్యత కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుపై ఉందన్నారు. హెలికాప్టర్‌ ద్వారా విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం కీలకమన్నారు. ఈ ప్రాంతానికి భోగాపురం గ్రోత్‌ ఇంజిన్‌గా పని చేస్తుందన్నారు. విమానాశ్రయం పూర్తయితే ఈ ప్రాంతం ఎకనమిక్‌ హబ్‌గా మారుతుందన్నారు. చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. భోగాపురం వరకు బీచ్‌ రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. పారిశ్రామిక ప్రాంతంగా ఎదగడానికి భోగాపురంకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీని పెంచాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల ఎన్నో అంశాలు మళ్లీ మొదటికి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ప్రారంభంలోనే 48 లక్షల మంది ప్రయాణికులతో రన్‌ అయ్యే పరిస్థితులు ఉంటాయన్నారు. భోగాపురం విమానాశ్రయానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుమతులు వచ్చాయన్నారు. అప్పుడు ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం ఉండదని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతున్నాయన్నారు. భవిష్యత్తులో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయన్నారు. 

Share