Current Date: 14 Feb, 2026

టీ20 ప్రపంచకప్‌లో నమీబియా చిత్తు.. టీమిండియా రికార్డు విజయం

నమీబియాతో జరిగిన టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 93 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఓపెనర్ ఇషాన్‌ కిషన్‌ (61), హార్దిక్‌ పాండ్య (52)ల విధ్వంసక ఇన్నింగ్స్‌లతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఒక దశలో స్కోరు 250 దాటుతుందనిపించినా, ఆఖరి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్‌ తక్కువ పరుగులకే పరిమితమైంది. నమీబియా బౌలర్ ఎరాస్మస్‌ 4 వికెట్లతో భారత బ్యాటర్లను కట్టడి చేశాడు. అనంతరం 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియాకు ఓపెనర్లు స్టీన్‌క్యాంప్‌ (29), ఫ్రైలింక్‌ (22) శుభారంభం ఇచ్చారు. ఒకానొక దశలో 9 ఓవర్లకు 85/2తో నిలిచిన ఆ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇస్తుందనే భ్రమ కలిగించింది. అయితే భారత స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి 3, అక్షర్‌ పటేల్‌ 2 వికెట్లతో రంగ ప్రవేశం చేయడంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. వీరిద్దరూ నమీబియా మిడిలార్డర్‌ను దెబ్బతీయడంతో ఆ జట్టు కేవలం 30 పరుగుల వ్యవధిలోనే చివరి 8 వికెట్లు కోల్పోయి, 116 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్‌ పాండ్యకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. టీ20 ప్రపంచకప్‌లో పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. దిల్లీ వేదికగా బ్యాటుతోనూ, బంతితోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సూర్యకుమార్ సేన.. ఆదివారం పాకిస్థాన్‌తో జరగనున్న హైవోల్టేజ్ పోరుకు ముందు మంచి లయను అందుకుంది.