Current Date: 28 Sep, 2024

భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య. 2 రోజులు వేధింపులు

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బతికున్నప్పుడు విలువ ఇవ్వకున్నా పర్లేదు కానీ.. చావుకైనా విలువ ఇవ్వలేదు ఓ ఇల్లాలు.భర్తతో ఉన్న గొడవల కారణంగా.. ఆయన చనిపోయిన తర్వాత కూడా మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా అడ్డుకుంది. బంధువులు ఎంత చెప్పినా వినకుండా రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే మృతదేహాం ఉండేలా చేసింది. ఇంతా చేసి.. చివరికి తన కుమారిడితో కనీసం తండ్రికి తలకొరివి కూడా పెట్టనీయకుండా తీసుకెళ్లిపోయింది. ఇదంతా చేసింది  తన భర్త ఆస్తిలో వాటా కోసం కావటం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.హైదరాబాద్‌కు చెందిన సంధ్య అనే యువతితో సునీల్‌కు 2020లో వివాహం జరగ్గా.. 2021లో ఒక కుమారుడు కూడా జన్మించాడు. గత సంవత్సర కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో దంపతులిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. మద్యానికి బానిసైన సునీల్.. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న సునీల్ తల్లి, సోదరుడు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి.. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం  మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం మంథని గోదావరి నది వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే.. మృతుని భార్య సంధ్య మంథనికి వచ్చి అంత్యక్రియలు కాకుండా అడ్డుకుంది. చివరికి పెద్దమనుషులు నచ్చ చెప్పడంతో  అంత్యక్రియలు అయ్యేంతవరకు కూడా ఆగకుండా సంధ్య తన కుమారున్ని తీసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది.

Share