Current Date: 06 Jul, 2024

ఏపీలో ఈ పథకాల లబ్ధిదారులకు ఊరట.... డిబిటీ ద్వారా నగదు పంపిణీకి లైన్ క్లియర్...

ఏపీలో డిబిటీల పంపిణీకి లైన్ క్లియర్ అయింది. గత 59 నెలలుగా లబ్ధి పొందుతున్న వారికి ఏపీ హైకోర్టు   గుడ్ న్యూస్ చెప్పింది . విద్యార్థులు, మహిళలు వేసిన పిటిషన్ పై సానుకూలంగా స్పందింస్తూ తీర్పు వెలువరించింది హై కోర్టు. ఏపీలో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికే ఏదో ఒక పథకం రూపంలో డీబీటీ ద్వారా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి నగదును జమచేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించకూడదని ఈసీకి పలు రాజకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి. అవసరమైతే పోలింగ్ తరువాత ట్రాన్స్‎ఫర్ చేయాలని సూచించాయి. అలాగే పోలింగ్ కు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం వల్ల ఓటర్లు ప్రలోభానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన ఈసీ డీబీటీ ద్వారా నిధులు విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది. వైఎస్ఆర్సీపీ అనుమతి కోరుతూ అందజేసిన లేఖపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జాప్యం చేసింది.ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీకి వివరణ ఇచ్చారు. గత నాలుగున్నర ఏళ్లుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నామని ఇది ఇప్పటికిప్పుడు తీసుకొచ్చిన పథకం కాదని వివరించారు. పైగా గత 58 నెలలుగా ప్రలోభానికి గురవ్వని వారు కేవలం ఈ ఒక్కసారి మాత్రమే ప్రలోభానికి ఎలా గురవుతారని ప్రశ్నించారు. దీనిపై ఈసీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో కొందరు విద్యార్థులు, మహిళలు, లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించారు. తమకు గత నాలుగున్నరేళ్లుగా అందుతున్న లబ్ధికి అడ్డుపడుతున్నారని పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన ఏపీ హైకోర్టు ఈసీకి పలు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఈసీ కోర్టుకు వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డిబిటీలను నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను నేటి వరకు అబయాన్స్‎లో  హై కోర్టు పెట్టింది . నేటితో ఆ గడువు ముగియడంతో ఈరోజు లేదా రేపు డిబిటిల ద్వారా ఆయా పథకాలకు సంబంధించిన నగదును పంపిణీ చేసేందుకు అవకాశం లభించింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పుతో లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగనుంది. ఆసరా, చేయూత, వసతిదీవెన, విద్యాదీవెన, లా నేస్తం, రైతు భరోసా వంటి పథకాల లబ్ధిదారులకు నగదు జమ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసి డీబీటీ ద్వారా నగదు ట్రాన్స్ ఫర్ చేసేందుకు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే డీబిటీల ద్వారా పంపిణీ చేసే పథకాలను ప్రసార మాధ్యమాల్లో, సభల్లో ప్రచారం చేయవద్దని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.