Current Date: 06 Jul, 2024

ఒకే ఫ్యామిలీలో 1200 ఓట్లు.. అభ్యర్థులు క్యూ!

దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. అభ్యర్ధులు ఓట్ల వేట అప్పుడే మొదలెట్టారు. ఈ క్రమంలో అస్సాంలోని తేజ్‌పూర్ నియోజకవర్గం పరిధిలోని నేపాలీ పామ్‌ గ్రామం పేరు ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఎలక్షన్స్‌గా అయిపోయింది.

ఆ గ్రామంలో ఒకే కుటుంబంలో ఏకంగా 1200 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ఒక్క కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడానికి స్థానిక అభ్యర్థులు తాయిలాలతో క్యూ కడుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే? ఈ గ్రామంలో నివసించే వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలోని నేపాలీ పామ్‌ గ్రామంలో రాన్‌ బహదూర్ థాపా అనే గోర్ఖా స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఆయనకు ఐదుగురు భార్యలు. 12 మంది కుమారులు, 10 మంది కుమార్తెలు సంతానం.

1997లో రాన్‌ బహదూర్ మరణించాడు. క్రమంగా అతని కుటుంబం ఆ ఊర్లో విస్తరించింది. కుటుంబం పెరిగే కొద్దీ మెరుగైన జీవనం కోసం వేరు వేరు కాపురాలు పెట్టారు. అలా ఒకే వంశం నుంచి ఏకంగా ఓ గ్రామమే ఏర్పడింది. వారి ఊరిలో ప్రస్తుతం 300 కుటుంబాలు ఉన్నాయి. వీరికి 65 మంది మనవళ్లు, 70 మంది మనవరాళ్లు ఉన్నారు. ప్రస్తుతం 2,500 మంది సభ్యులు ఆ కుటుంబంలో ఉన్నారు. వారిలో వయోజన ఓటర్ల సంఖ్య 1,200 మంది. కుటుంబ పెద్దలు ఎంచుకున్న అభ్యర్థికే వీరంతా ఓటు వేస్తారు.