Current Date: 05 Oct, 2024

తెలంగాణ స్కిల్‌ వర్సిటీకి చైర్మన్‌గా ఆనంద్‌ మహింద్రా

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్‌ ఇండియా తెలంగాణ స్కిల్స్‌ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌గా ఆనంద్‌ మహింద్రా నియమితులు కాబోతున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం సందర్భంగా ప్రకటించారు. తొలిసారిగా పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, యువతకు వివిధ ట్రేడ్‌లలో స్కిల్స్‌ నేర్పించడంతో కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు.ఈ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించాల్సిందిగా ఆనంద్‌ మహింద్రాను కోరానని, రెండు మూడు రోజుల్లో రిప్లై ఇస్తానంటూ ఆయన సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఆయనే చైర్‌పర్సన్‌గా తన సమ్మతిని తెలియజేయనున్నట్లు సీఎం రేవంత్‌ ఆ వేదిక ద్వారా ప్రకటించారు. టెక్‌ మహింద్రా యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చిన మహింద్రా గ్రూపు చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు  జరిగిన విషయం తెలిసిందే.

Share