Current Date: 04 Jul, 2024

పిఠాపురంలో జనసేన నేతపై సస్పెన్షన్ ఎత్తివేత.. నోరుజారాడని శిక్ష

ఏపీలో పోలింగ్ తర్వాత జనసేన పార్టీ ఓ నేతపై సస్పెన్షన్ ఎత్తివేసింది. మాదేపల్లి శ్రీనివాస్ (రాయవరం)పై జనసేన పార్టీ విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సస్పెన్షన్‌కు కారణమైన ఆరోపణలపై ఆయన సంతృప్తికరమైన సమాధాన ఇచ్చిన నేపథ్యంలోసస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నామని తెలిపారు.

మాదేపల్లి శ్రీనివాస్ పిఠాపురం నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యకలాపాల్లో ఎప్పటి మాదిరిగానే పాల్గొనచ్చని తెలిపారు. ఎన్నికలకు ముందు.. మార్చి నెలలో మాదేపల్లి శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం పట్టణ జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీ గీత దాటాడంటూ జనసేన అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకుంది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ ముఖ్యనేత కొణిదెల నాగబాబు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

మాదేపల్లి శ్రీనివాస్‌ను ఎన్నోసార్లు హెచ్చరించినా కూటమి పొత్తు ధర్మానికి విరుద్దంగా వ్యవహరించారని జనసేన పార్టీ ఆరోపించింది. ఆయన తెలుగు దేశం పార్టీ శ్రేణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారన్నారు. జనసేన పార్టీ నాయకత్వం, జనసేన పార్టీ కార్యకర్తలతో కూడా అనుచితంగా ప్రవర్తించారని పార్టీ భావించింది. ఈ కారణాలతోనే మాదేపల్లి శ్రీనివాస్‌ను జనసేన పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రెండు వారాల్లోగా తనపై వచ్చిన ఆరోపణలకు.. లిఖితపూర్వంగా సంజాయిషీ, వివరణ ఇవ్వాలని జనసేన అధిష్టానం ఆదేశించింది.ఇప్పుడు ఆయనపై సస్పెన్షన్ ఎత్తేశారు.