Current Date: 11 May, 2026

ఐపీఎల్‌లో ముంబయిని ఇంటిబాట పట్టించిన బెంగళూరు

ఐపీఎల్-2026లో భాగంగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబయి ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి.. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 166 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ (57), నమన్ ధీర్ (47) రాణించగా, రోహిత్ (22), సూర్యకుమార్ (0) విఫలమయ్యారు. భువి తన స్పెల్‌తో ముంబయిని ఆదిలోనే దెబ్బతీసి ఆ జట్టు భారీ స్కోరు సాధించకుండా అడ్డుకున్నాడు. 167 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరుకు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్ అయి నిరాశపరిచాడు. అయితే, కృనాల్ పాండ్య (73) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఆఖరి ఓవర్లో ఉత్కంఠ పరాకాష్టకు చేరగా, రాజ్‌ బవా వేసిన చివరి బంతికి రసిఖ్‌ రెండు పరుగులు తీయడంతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లో రాణించిన భువనేశ్వర్, బ్యాటింగ్‌లోనూ ఆఖర్లో కీలక సిక్సర్ బాది జట్టు గెలుపులో ముఖ్య భూమిక పోషించారు. ఈ ఓటమితో ముంబయి ఇండియన్స్‌తో పాటు లక్నో సూపర్‌జెయింట్స్ కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోవడంతో లక్నో కథ ముగిసింది. ఎనిమిదో ఓటమిని నమోదు చేసిన ఈ రెండు జట్ల ప్రయాణం ఈ సీజన్‌లో లీగ్ దశకే పరిమితం కాగా, ఈ విజయంతో ఆర్సీబీ తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.