ఫ్యామిలీ గొడవలకు సంబంధించి నోటీసులు అందుకున్న మంచు సోదరులు మనోజ్, విష్ణు.. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. అదనపు మేజిస్ట్రేట్ హోదాలో సీపీ వారిని విచారించారు. ఈ సందర్భంగా.. కుటుంబ సమస్యను శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దని, ఇరు వర్గాలు శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సీపీ వారికి సూచించినట్లు సమాచారం. అలాగే మరోసారి ఘర్షణకు దిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మొదట మంచు మనోజ్, ఆ తరువాత విష్ణు వాంగ్మూలం తీసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఏడాదిపాటు ప్రతికూల చర్యలకు దిగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని రూ.1లక్ష పూచీకత్తు సమర్పించారు.