Current Date: 03 Oct, 2024

మళ్లీ చిక్కుల్లో పడిన బాబా రాందేవ్‌ ఢిల్లీ హైకోర్టు అక్షింతలు

యోగా గురు బాబా రాందేవ్‌ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తి చేసే ఆయుర్వేద పళ్ల పొడి ‘దివ్య మంజన్‌’లో మాంసాహార ఆనవాళ్లు ఉన్నాయంటూ ఢిల్లీ హైకోర్టులో ఒకరు పిటీషన్ దాఖలు చేశారు. దాంతో ఆ  పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు బాబా రాందేవ్‌, పతంజలి సంస్థతో పాటు కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేసింది. పతంజలికి చెందిన దివ్య మంజన్‌ను మొక్కల ఆధారిత ఆయుర్వేద ఉత్పత్తిగా ప్రచారం చేస్తుండడంతో తాను ఏళ్లుగా ఆ పౌడర్‌ను ఉపయోగిస్తున్నట్టు పిటిషనర్‌ అయిన అడ్వకేట్‌ యతిన్‌ శర్మ తెలిపారు. అయితే, ఇందులో చేపల నుంచి తీసే ‘సుమద్రఫేన్‌’ (సేపియా అఫిసినాలిస్‌)ను ఉపయోగించినట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్యాక్‌పై పండ్లపొడి శాఖాహార ఉత్పత్తేనని సూచించే ఆకు పచ్చ చుక్క ఉందని.. కానీ పదార్థాల జాబితాలో మాంసాహారానికి సంబంధించిన కటిల్‌ ఫిష్‌ ఉందని యతిన్‌ శర్మ చెప్పుకొచ్చారు. ఆనాది కాలంగా తమది పూర్తి శాకాహార కుటుంబమని చెప్పుకొచ్చిన యతిన్‌ శర్మ.. చేపల నుంచి తీసే దానితో పళ్లు తోముకున్నామని తెలిసి తనతో పాటు కుటుంబం కూడా తీవ్ర మనస్తాపానికి గురైందని పేర్కొన్నారు. 

Share