Current Date: 01 Oct, 2024

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యిపై సిట్‌ దర్యాప్తు నిలిపివేత

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) దర్యాప్తు నిలిపివేసింది. లడ్డూ వివాదంపై సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో సిట్‌ దర్యాప్తు తాత్కాలికంగా ఆగిపోయింది. నెయ్యి కల్తీపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా లేక వేరే సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్న విషయంలో సుప్రీంకోర్టు సొలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయాన్ని కోరింది. దీంతో లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే దాకా సిట్‌ తన దర్యాప్తును  నిలిపివేసింది. తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యికల్తీ అయిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై  స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీసుబ్బారెడ్డితో పాటు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే. కాగా, నెయ్యి కల్తీ వ్యవహారంపై  సిట్‌ మూడు రోజులపాటు దర్యాప్తు చేసింది.  కల్తీపై ఫిర్యాదులో జాప్యం ఎందుకు జరిగింది అనే అంశంతో పాటు పలు కీలక విషయాలపై టీటీడీ అధికారుల నుంచి సిట్‌ సమాచారం రాబట్టింది. టీటీడీ మార్కెటింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం కార్యాలయంలోనూ తనిఖీలు చేసింది.

Share