Current Date: 02 Jul, 2024

లంచాధికారికి నడుం నొప్పట!

పరవాడ ఫార్మాసిటీలో ప్రతి కంపెనీ నుంచీ పాతికవేల రూపాయలు వసూలు చేసిన జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌గా ఎ.గణేషన్‌ను ప్రభుత్వం సెలవులో పంపించింది. ‘ఫార్మాసిటీలో ఒక్కపూట ఫార్మాలిటీ రు.25 లక్షలు.. ఒక్కో కంపెనీ నుంచి రు.25 వేలు, అద్దె కారులో వచ్చి అడ్డంగా వసూళ్ళు... జేసీఎల్‌ బరితెగింపు’ అన్న శీర్షికన ‘లీడర్‌’ దినపత్రికలో పరిశోధనాత్మక కధనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వార్తకు కమిషనర్‌ శేషగిరిబాబు స్పందించి గణేషన్‌ను సస్పెండ్‌ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే గణేషన్‌ కాళ్ళావేళ్ళా పడి బతిమిలాడు కోవడంతో సెలవుపై వెనక్కు పంపించినట్టు తెలుస్తోంది. తనకు తీవ్రమైన నడుంనొప్పి వున్నందువల్ల మే 14 నుంచి 31వ తేదీ వరకూ మెడికల్‌ గ్రౌండ్స్‌లో సెలవు కావాలని గణేషన్‌ దరఖాస్తు చేసుకున్నాడు. అది కూడా సగం జీతానికి సెలవు కావాలని కోరుకున్నారు. అయితే సెలవు దరఖాస్తును పెండిరగ్‌లో పెట్టి గణేషన్‌ విజయవాడలో వెలగబెడుతున్న స్థానంలో ఐ.మాధవిని నియమించారు. గణేషన్‌ విజయవాడలో ఏపీబీ అండ్‌ ఓసీడబ్ల్యూడబ్ల్యూబీకి డిప్యూటీ సీఈఓగా వెలగబెడుతూ విశాఖకు ఇన్‌ఛార్జిగా వచ్చారు. ఇప్పుడు విశాఖలో జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌గా గణేషన్‌ స్థానంలో ఎస్‌.లక్ష్మీ నారాయణకు పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగించారు. లక్ష్మీనారాయణ ఇప్పటకీ విజయవాడ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.