Current Date: 05 Oct, 2024

జులై 31న పాలిటెక్నిక్ లలో మిగిలిఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

పాలిసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన నేపధ్యంలో మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, అడ్మిషన్ల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో మిగిలి ఉన్న సీట్లను పాలీసెట్ అర్హత కలిగిన, అర్హత లేని అభ్యర్థులచే అయా పాలిటెక్నక్ ల స్ధాయిలో భర్తీ చేస్తారన్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఖాళీ సీట్ల కోసం సంబంధిత పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్‌లను సంప్రదించి స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను సమర్పించాలన్నారు. అయా పాలిటెక్నిక్ లలో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను శాఖలు, క్యాటగిరీల వారీగా జులై 27న నోటీస్ బోర్డులో ప్రదర్శిస్తారన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, నిర్ధేశించిన రుసుముతో జులై 31న వ్యక్తిగతంగా విద్యార్ధులు సీటు ఆశిస్తున్న పాలిటెక్నిక్‌లకు హాజరు కావాలని కన్వీనర్ స్పష్టం చేసారు. పాలీసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఇప్పటికే కేటాయింపు పొందిన, కోర్సులో ప్రవేశం తీసుకున్న అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్‌కు అర్హులు కాదన్నారు. ఈ స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించబోదని గణేష్ కుమార్ వివరించారు.

Share