Current Date: 05 Oct, 2024

టీ20 వరల్డ్‌కప్‌లో ఫస్ట్ మ్యాచ్‌లోనే ఓడిన భారత్ ఉమెన్స్ టీమ్

దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 ఉమెన్స్ ప్రపంచకప్‌‌ ఫేవరెట్లలో ఒకటనుకున్న భారత జట్టు టోర్నీని ఘోర పరాజయంతో మొదలుపెట్టింది. ఇప్పటికే న్యూజిలాండ్‌పై ఉన్న పేలవ రికార్డును కొనసాగిస్తూ ఆ జట్టు చేతిలో 58 పరుగుల తేడాతో శుక్రవారం రాత్రి మరో పరాజయం చవిచూసింది. ఈ దెబ్బతో భారత్ జట్టు సెమీస్‌ అవకాశాలు దారుణంగా పడిపోయాయి.దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్‌ సోఫీ డివైన్‌ 36 బంతుల్లో 57 పరుగులతో సత్తాచాటింది. భారత బౌలర్లలో రేణుక సింగ్‌ 2, ఆశ శోభన, అరుంధతి రెడ్డి చెరో వికెట్ తీశారు.161 పరుగుల ఛేదనలో భారత్ జట్టు మరీ పేలవంగా 19 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన 15 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం. మిగిలిన బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆదివారం తన తర్వాతి మ్యాచ్‌లో భారత్‌.. పాకిస్థాన్‌ను ఢీకొంటుంది.

Share