Current Date: 04 Jul, 2024

పగలు పెళ్లి చేసుకున్నారు.. రాత్రి పరుగుల మందు తాగారు

వాళ్లిద్దరూ చాలా రోజులుగా ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెద్దలు ఒప్పుకోరనే భయంతో ఇంట్లో వారికి చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమె మైనర్‌ కావడం, పెద్దలు ఏమంటారోననే భయంతో ఆ జంట పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటన తెలంగాణలోని షాద్‌నగర్‌ నియోజకవర్గం కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాసిపల్లికి చెందిన కావలి శ్రీకాంత్‌(24) షాద్‌నగర్‌లోని ఓ కిరాణా దుకాణంలో పనిచేసేవాడు. అతనికి రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెద్దలకు తెలియకుండా యాదగిరిగుట్టలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

అనంతరం ఉత్తరాసిపల్లిలోని శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లారు. తరువాత మాట్లాడుదామనే ఉద్దేశంతో పెద్దలు అప్పటికి ఏమీ అనలేదు. అయితే అమ్మాయి మైనర్‌ అయినందున తమ వివాహాన్ని రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించరనే ఆందోళనతో అదేరోజు రాత్రి గ్రామంలోని విద్యుత్‌ ఉపకేంద్రం వద్దకు వెళ్లి ఇద్దరూ పురుగు మందు తాగారు. గమనించిన శ్రీకాంత్‌ కుటుంబసభ్యులు వెంటనే వారిని షాద్‌నగర్‌ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 1న బాలిక, 2న శ్రీకాంత్‌ మృతిచెందారు.