Current Date: 05 Oct, 2024

తంబళ్లపల్లెలో పరువు హత్య సినిమా స్టోరీని తలపించే ఘటన

 ఆ బాలిక తన బంధువుల అబ్బాయి ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో అతడితో వెళ్లిపోయింది. దాంతో మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. కానీ రోజుల వ్యవధిలోనే చెట్టుకు చున్నీతో బాలిక ఉరి వేసుకొని కనిపించింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.   వాస్తవానికి బాలిక గత నెలలో అదృశ్యమైంది. తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను వెతికి తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. స్టేషన్‌లో బుజ్జగించి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లగా సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని కాల్చేయడంతో పరువుహత్య కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   ఈ మృతిపై కేసు నమోదు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న భయంతో పెద్ద మనుషులు పోలీసులను మేనేజ్‌ చేసి, మృతదేహాన్ని గుట్టకు పడమర వైపున పొలంలో కాల్చివేశారు. ఈ విషయంపై మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడిని వివరణ కోరగా, అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా కేసు నమోదు చేశామని చెప్పారు.

Share